1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (10:11 IST)

మరో వారం రోజుల్లో రెండు గ్యారెంటీ హామీల అమలు.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి

revanth reddy
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో భాగంగా, మరో వారం రోజుల్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. గత ఐదేళ్ళుగా గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలదోపిడి జరిగిందన్నారు. 
 
అలాగే, రాయితీపై వంట గ్యాస్ సిలిండర్ అమలు హామీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్‌ను అందించనున్నట్టు తెలిపారు. గత ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశామన్నారు. రూ.500కే వంట గ్యాస్ పంపిణీ పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. 
 
అదేవిధంగా భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీ, దేవాదుల, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులను డబ్బులు దండుకొని అసంపూర్తిగా వదిలేశారన్నారు. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలు పేరుతో రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకూ నీరు పారలేదన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజుకు 12 టీఎంసీల నీరు తరలించుకుపోతున్నా చూస్తూ, సినిమాలు చూశారన్నారు. 
 
కొడంగల్ ఎవరూ ఊహించని విధంగా సుమారు రూ.5 వేల కోట్లు తెచ్చానన్నారు. ఈ నిధులతో నారాయణ్ పేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం, మెడికల్, ఇంజినీరింగ్, ప్రభుత్వ జూనియర్, మహిళా డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాలలకు శిలాఫలకాలు వేశామన్నారు. 2014లోనే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల కోసం 69 జీవో తెచ్చానని గుర్తుచేశారు. 7.10 టీఎంసీలతో లక్ష ఎకరాలకు సాగునీరు అందేలా మంజూరు చేయించినట్టు గుర్తు చేశారు. 
 
అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి అడిగి పునాది వేశారన్నారు. కానీ ఈ పథకాన్ని పదేళ్ల పాటు పక్కనపెట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకుని ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించచారు. ఈ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, పర్నికారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.