గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

విషాదంగా ముగిసిన సాఫ్ట్‌వేర్ దంపతుల విహార యాత్ర : పారాగ్లైడింగ్ చేస్తూ...

deadbody
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ దంపతుల విహార యాత్ర విషాదంగా ముగిసింది. భర్త కళ్లముందే పారా గ్లైడింగ్ చేస్తున్న భార్య ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం శిల్ప బృందావనం కాలనీకి చెందిన సాయి మోహన్, నవ్య(26) అనే దంపతులు చండీగఢ్‌‌లో సాఫ్ట్‌వేర్ దంపతులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికి ఒక యేడాది క్రితం వివాహమైంది. 
 
విహారయాత్రకై శనివారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులూకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం నవ్య పారాగ్లైడింగ్ చేస్తుండగా కొద్దిసేపటికే హుక్ ఊడిపోయి ఓ ఇంటి పైకప్పుపై పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో పారాగ్లైడింగ్ చేయించిన పైలట్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. 
 
ఈ ఘటన మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని హిమాచల్ ప్రదేశ్ పర్యాటక అధికారులు బాధిత కుటుంబికులకు సమాచారం ఇచ్చారు. పైలట్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. పారాగ్లైడింగ్ చేస్తున్నామని వీడియోకాల్ మాట్లాడిన కాసేపటికే ప్రమాదం జరిగిందని చెబుతూ సాయిమోహన్ తండ్రి తిరుమలరావు, కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కులూలో శవపరీక్షల అనంతరం అధికారులు సోమవారం రాత్రి మృతదేహాన్ని విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చి స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.