1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 మార్చి 2024 (12:05 IST)

గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా... పుదుచ్చేరి లోక్‌సభ నుంచి పోటీ!!

tamizhisai sounderrajan
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం తమిళిసై రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. లోక్‌సభ ఎన్నికల్లో నేపథ్యంలో తమిళిసై రాజీనామా సంచలనంగా మారింది. ఆమె పుదుచ్చేరి లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
నిజానికి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. కానీ, అలాంటిదేమీ లేదంటూ ఆమె తోసిపుచ్చుతూ వచ్చారు. ఈ క్రమంలో తన గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆమె సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఖాయమని తేలిపోయింది. నాడార్ సామాజిక వర్గానికి చెందిన తమిళిసై... పుదుచ్చేరి లేదా తమిళనాడులోని సౌత్ చెన్నై, తిరునెల్వేలి, కన్యాకుమారి లోక్‌సభ స్థానాల నుంచి ఆమె బరిలోకి దిగొచ్చన్న ప్రచారం సాగుతుంది.