పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష రద్దు : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
గత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వం పదేళ్ళ క్రితం నిర్వహించిన గ్రూపు-2 పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ పరీక్షను గత 2015-16లో నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఎంపికైన వారి జాబితాను రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని, పరిధిదాటి వ్యవహరించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పునర్ మూల్యాంకనం చేసి అర్హుల జాబితా నిర్ణయించాలని, ఈ ప్రక్రియ 8 వారాల్లో ముగించాలని హైకోర్టు ఆదేశించింది.
వైట్నర్, దిద్దుబాటు ఉన్న జవాబుపత్రాల మూల్యాంకనంపై హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ట్యాంపరింగ్ జరిగినట్లు తెలిసినా.. మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. సాంకేతిక కమిటీ సూచన ప్రకారం పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశించింది.
2015లో టీజీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. 2016 నవంబరులో రాతపరీక్షలు నిర్వహించింది. 2019లో గ్రూప్-2 నియామకాలు చేపట్టింది. దీనిపై పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ నగేశ్ భీమపాక తీర్పు వెలువరించారు.