1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 జనవరి 2024 (20:55 IST)

తెలంగాణాలో మూతపడిన పరిశ్రమలకు మహర్ధశ!!

revanth
తెలంగాణ రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలకు మహర్ధశ రానుంది. గత కొంతకాలంగా మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, ములుగులో బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ పునరుద్ధరణపై ఆయన తొలుత దృష్టిసారించారు. 
 
ఈ మిల్లులో వస్త్రాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జు తయారవుతుంది. 2014లోనే ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరందరికీ ఉపాధి కల్పించటంతో పాటు స్థానికంగా ఉద్యోగ కల్పనకు వీలుగా ఈ మిల్లును తిరిగి తెరిపించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపారు. 
 
నేషనల్ కంపెనీ లా ట్రిబున్యల్ తీర్పు ప్రకారం ప్రస్తుతం బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినంలో ఉన్నాయి. ఆ కంపెని ఎండీ హార్దిక్ పటేల్‌, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈఓ వాదిరాజ్ కులకర్ణితో పాటు సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి డా. బి.ఆర్. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే ఆలోచనను వారితో పంచుకున్నారు. ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యాసాధ్యాలను చర్చించారు.  
 
మిల్లును తెరిపించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిన్‌క్వెస్ట్ బృందాన్ని కోరారు. బిల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఐటీసీ కంపెని ఆసక్తి చూపుతోంది. ఫిన్‌క్వెస్ట్ కంపెనీ ఐటీసీతో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కోరారు. బిల్ట్ మిల్లును పునరుద్ధరించే ప్రక్రియలో ఐటీసీకి అన్ని విధాలా ప్రభుత్వ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీసీ చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.   
 
సీఎంతో పాటు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ములుగు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం 2015, 2018లో ప్రోత్సాహకాలను పొడిగించి, మూతపడ్డ ఈ యూనిట్‌ను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.