తెలంగాణ రాష్ట్ర ద్రోహి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి : సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ద్రోహి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఒక్క మంచి పని చేద్దామన్న కించిత్ ఆలోచన కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అందువల్ల ఆయనను నమ్మే పరిస్థితి లేదని, ఆయన విశ్వసనీయతే ఒక పెద్ద ప్రశ్నార్థకమని సీఎం వాఖ్యానించారు.
అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకుండా, ఢిల్లీలో పని ఉందని చెప్పి కిషన్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్ను రహస్యంగా కలిశారని విమర్శించారు. సి.ఆర్. పాటిల్ను రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తాము కూడా పాటిల్ను కలుస్తున్నామని, తమతో పాటు రావాలని కోరినా కిషన్ రెడ్డి స్పందించలేదని, అలా వస్తే ఆయన కిరీటం ఏమైనా పోతుందా అంటూ సీఎం ఎద్దేవా చేశారు.
కిషన్ రెడ్డి అన్ని రకాలుగా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే, అఖిలపక్ష సమావేశానికి వచ్చిన బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావులు ప్రభుత్వ వాదనలకు మద్దతు తెలిపారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ వాదనతో వారు ఏకీభవించారని, భవిష్యత్ కార్యాచరణలో ప్రభుత్వానికి సహకరిస్తామని వారు చెప్పారని తెలిపారు. ప్రభుత్వం ఎక్కడికి వెళ్లినా తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని, ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని వారు చెప్పారని, వారి మాటల్లో చిత్తశుద్ధి కనిపించిందని సీఎం అన్నారు.
నదీ పరివాహక ప్రాంత అవసరాలు తీరిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని కేటాయించడం, తరలించడం, మళ్లించడం చేయాల్సి ఉంటుందని, అంతర్జాతీయ నీటి చట్టాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీటిని తరలించాలని అన్నారు. జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీలను ఏర్పాటు చేసినా, వాటికి డీపీఆర్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. జీఆర్ఎంబీకి సమాచారం ఇచ్చాక, తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అనుమతులు పొందాల్సి ఉండగా, అవేవీ పాటించకుండా నేరుగా కేంద్రం నుంచి అనుమతులు పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.