మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 మే 2021 (09:29 IST)

నాగార్జున సాగర్‌లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ!

తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార తెరాస విజయం సాధించింది. సాధారణంగా ఉప ఎన్నిక అంటే.. అధికార పార్టీనే విజయం వరించేలా ఉంటుంది. అందులోనూ సెంటిమెంట్ ఉన్న చోట అది మరికాస్త ఎక్కువ ఉంటుంది. ఈ లెక్కలేసుకున్నాకే.. బరిలో దిగిన పార్టీలు జబ్బలు చరుచుకోవాలి. 
 
ఎక్కడో దొరికిన విజయాన్ని ఇక్కడ దొరకపుచ్చుకుంటాం అంటూ గుడ్డిగా ముందుకు వెళితే ఇదిగో ఇప్పుడు బీజేపీలానే ఉన్న పరువు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఈపాటికే అర్థం అయివుంటుంది.. ఇవి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గురించి చెబుతున్న మాటలని. అక్కడ పోటీకి దిగిన బీజేపీకి డిపాజిట్టూ దక్కకపోవడం తెలంగాణా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ పరిచింది.
 
ఎందుకంటే, ఒక పక్క కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. మరో పక్క దుబ్బాకలో గెలుపు.. గ్రేట‌రులో మెరుపులు కమలదళానికి ఫుల్‌జోష్ ఇచ్చాయి. దీంతో తామే అధికార తెరాస పార్టీకి సరైన పోటీ అనే భావనలోకి వెళ్ళిపోయారు. అదే ధోరణిలో కాలుదువ్వుతూ వస్తున్నారు. 
 
అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలు మొదట ఓ షాక్ ఇచ్చాయి. సిట్టింగ్ స్థానాన్నీ గెలవలేకపోయింది.. ఇంకో స్థానంలో నాలుగో ప్లేసులో ఆగిపోయింది. వెంటనే సాగర్ ఉప ఎన్నిక హడావుడి మొదలైంది. దీంతో మళ్ళీ మేమే అంటూ దూకుడుగా అక్కడ ప్రచారం అన్ని పార్టీల కంటే ముందే మొదలెట్టేశారు. చివరికి వచ్చేసరికి ధరావత్తూ దక్కక బోర్లా పడ్డారు. ఇక్కడ బీజేపీ ఓటమి కన్నా.. కనీసం డిపాజిట్ దక్కకపోవడమే విశేషం. ఆ పార్టీకి కేవలం 7,676 ఓట్లే వచ్చాయి.