1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (12:29 IST)

గోదారమ్మ విలయతాండవం.. ఏరియల్ సర్వే చేయనున్న సీఎం కేసీఆర్

kcrao
నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ కారణంగా అనేక జిల్లాలు వరద ముంపునకు గురయ్యారు. అనేక గ్రామాలు నీట ముగినిపోయాయి. ఈ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే చేయనున్నారు. 
 
భారీ వర్షాల కారణంగా నెలకొన్న వరద నష్టం, గోదావరి పరీవాహక ప్రాంతంలో పోటెత్తిన వరదపై సమీక్షించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌తో కలిసి సీఎం ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించనున్నారు. 
 
ఏరియల్ సర్వేకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ సహా భద్రతా పరమైన అంశాలను అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తోంది. వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. 
 
సీఎం ఆదేశాల మేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన వైద్యులు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. రేపు సీఎం ఏరియల్‌ సర్వే నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తుంది.