మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 జనవరి 2021 (10:32 IST)

కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా అంగన్‌వాడీ టీచర్ మృతి.. ఛాతిలో నొప్పి అంటూ..?

కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా వరంగల్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ ఆకస్మికంగా మృతిచెందింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజులకే ఆమె మరణించడం స్థానికంగా కలకలం రేపింది. ఛాతిలో నొప్పి కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ నగరం దీన్దయాళ్‌నగర్‌కు చెందిన గన్నారపు వనిత(45) అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. హెల్త్ కేర్ వర్కర్‌గా కూడా పనిచేస్తున్నారు. 
 
జనవరి 19న ఆమె తన తోటి ఉద్యోగులతో కలిసి న్యూశాయంపేట అర్బన్ హెల్త్ సెంటర్‌లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించారు. అయితే మూడు రోజులు బాగానే ఉన్న వనిత.. శనివారం(జనవరి 23)న తనకు ఛాతీలో నొప్పిగా ఉన్నట్టు వైద్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె వైద్యులు మందులు ఇచ్చి ఇంటికి పంపారు. నొప్పి ఎక్కువైతే ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. 
 
అయితే నొప్పి తగ్గడంతో వనిత ఇంటివద్దే ఉంది. అయితే ఆదివారం ఉదయం వనిత నిద్రలేవలేదు. కుటుంబ సభ్యులు ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించిన స్పందన లేదు. దీంతో వారు వైద్యులకు సమాచారం అందజేశారు. దీంతో ఆమె నిద్రలోనే మరణించినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం వనిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నివేదిక అందిన తర్వాతనే ఆమె మృతికి గల కారణాలు తెలుస్తాయని తెలిపింది.