శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (09:37 IST)

తెలంగాణలో సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు విద్యుత్‌ ఉచితం

క్షౌరశాలలు (సెలూన్‌ షాపులు), లాండ్రీ షాపులు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిశీలించి తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.

ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, బలహీనవర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

తరతరాలుగా కులవృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు తాజా నిర్ణయంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఉచిత విద్యుత్తుతో యంత్రపరికరాలు వాడడం ద్వారా వారికి శారీరక శ్రమ తగ్గడమేకాక ఆర్థిక వెసులుబాటు కూడా కలుగుతుందని సీఎం తెలిపారు.