శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 నవంబరు 2020 (12:09 IST)

తొలి వ్యాక్సిన్‌ను తెలంగాణకు ఇవ్వాలి.. ఈటెల డిమాండ్

ప్రపంచమంతా కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ తయారీలో కీలక దశకు చేరుకున్నాయి. కరోనాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో హైదరాబాద్‌లో ఉన్న భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఈ, తదితర కంపెనీలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి.
 
అయితే నగరం నుండి వ్యాక్సిన్ తయారీ అవుతున్న కారణంగా ముందుగా వ్యాక్సిన్‌ను తెలంగాణ ప్రజలకే ఇవ్వాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీని ఈటెల కోరారు. ఇక్కడి ప్రజలకు సరిపోయేన్ని డోసులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 
 
కరోనా భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గం కాబట్టి ప్రజలందరికీ అతి త్వరలో వ్యాక్సిన్‌ అందేలా చూడాలని ప్రధానిని ఈటెల కోరారు. హైదరాబాద్‌ నుంచి వ్యాక్సిన్‌ అభివృద్ధికి భారత్‌ బయోటెక్‌ చేస్తున్న కృషి తుదిదశకు చేరుకుంది. 
 
ఇప్పటికే మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతుండగా, వచ్చే రెండు మూడు నెలల్లో పూర్తి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. ఫార్మారంగానికి తెలంగాణ చూపిన చొరవకు కృతజ్ఞతగా, ప్రపంచానికి కరోనా నుంచి విముక్తి కల్పిస్తున్న సందర్భంగా.. తొలి వ్యాక్సిన్‌ను తమకే ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.