డబుల్ బెడ్రూం గృహాల మంజూరులో పేదలకే పట్టం : టీ మంత్రి ఈటెల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రెండు పడకల గదుల ఇళ్ళ మంజూరులో పేదలు, గుడిసెల్లో నివశించే వారికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలపై కలెక్టరేట్లో గృహనిర్మాణ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న రెండు పడకల గదుల ఇళ్ల మంజూరులో ఇళ్లు లేనివారితో పాటు గుడిసెలలో నివసిస్తున్న పేదలకు అధికారులు, ఎమ్మెల్యేలు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ ఇళ్ల నిర్మాణాలను మురికి కూపాల వద్ద, గ్రామాలకు దూరంగా నిర్మించరాదని.. అనుగావున్న స్థలాల్లోనే వీటిని నిర్మించాలని సూచించారు.
నిర్మాణాలకు ప్రభుత్వ స్థలం దొరకని చోట ప్రభుత్వమే స్థలాన్ని కొంటుందన్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో నకిలీ పాసు పుస్తకాలను గుర్తించడంతో పాటు, తరచూ పైరవీలు చేసేవారితో పాటు భూ ఆక్రమణకు పాల్పడే వారి జాబితాలను ఆర్డీవోలు సేకరించి కలెక్టర్కు పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.