తెలంగాణ పెట్టుబడులకు అనుకూలం: మంత్రి కేటీఆర్
మౌలిక వసతులు, పారదర్శక పాలనతో వ్యాపారానికి అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మలేషియా ప్రతినిధి బృందాన్ని కోరారు. మలేషియా, వ్యాపార, పరిశ్రమల శాఖమంత్రి ముస్తఫా మహమ్మద్ నేతృత్వంలోని పారిశ్రామికవేత్తల ప్రతినిధి బృందం బుధవారం కేటీఆర్తో సమావేశమైంది.
ఇందులో మలేషియా, తెలంగాణ మధ్య వ్యాపార సంబంధాలు, పెట్టుబడులపై వారు చర్చించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం, వ్యాపార అవకాశాలను కేటీఆర్ వారికి వివరించారు. హైదరాబాద్ నగరంలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పారిశ్రామిక విధానంతో ముందుకు వెళుతోందని, ముఖ్యంగా.. పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూనే.. పరిశ్రమలకు అనుమతులు తక్షణం మంజూరు చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపట్టారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.