1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (12:28 IST)

గచ్చిబౌలిలోని పేకాట స్థావరంపై దాడి.. 12 మంది అరెస్ట్

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని పేకాట స్థావరాన్ని మాదాపూర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చేధించారు. ఓ అపార్ట్‌మెంట్లోని ఫ్లాట్‌లో కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.9లక్షల నగదు, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
 
కాకర్ల మాధవరెడ్డి అనే వ్యక్తి గచ్చిబౌలి గ్రీన్ ల్యాండ్ కాలనీలో ఓ ఫ్లాట్‌ను రోజుకు రూ.6వేల చొప్పున అద్దెకు తీసుకుని ఈ పేకాట దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 
దీనిపై స్థానికుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా దాడులు చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. నిర్వాహకుడు మాధవరెడ్డితో పాటు 12 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.