1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (22:38 IST)

పోలీసులపై దాడి.. చంచల్‌గూడ జైలుకు వైఎస్ షర్మిల.. 14 రోజుల రిమాండ్

ys sharmila
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను చంచల్‌గూడ జైలుకు తరలించారు. సోమవారం పోలీసులపై చేయి చేసుకున్న ఘటనలో ఆమెపై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను నాంపల్లి కోర్టుకు తరలించారు. మరోవైపు, షర్మిళ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు కూడా పూర్తయ్యాయి. తీర్పును కోర్టు రిజర్వు చేసింది. 
 
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దర్యాప్తుపై సిట్ అధికారికి వినతి పత్రం ఇవ్వాలని షర్మిళ నిర్ణయించుకున్నారు. లోటస్ పాండ్‌లోని తన ఇంటి నుంచి ఆమె సోమవారం మధ్యాహ్నం సిట్ ఆఫీసుకు బయలుదేరారు. ఈ క్రమంలో బంజారా హిల్స్ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. తనను అడ్డుకున్న పోలీసులతో ఆమె దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాత షర్మిళను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
 
అదేసమయంలో షర్మిళ వ్యవహారశైలిపై పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా షర్మిళ, ఏ2గా డ్రైవర్ బాబు, ఏ3గా యాకబ్‌లను పోలీసులు చేర్చారు. అయితే, షర్మిళ, బాబులను పోలీసులు అరెస్టు చేయగా, యాకబ్ మాత్రం పరారీలో ఉన్నాడు.