1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (19:08 IST)

17వ రోజు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్ర వైయస్ షర్మిల ప్రారంభించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 17వ రోజు శుక్రవారం దిగ్విజయంగా కొనసాగింది. మహిళలలు కోలలు ఆడుతూ, అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ తమ సమస్యలను తెలుపుతూ పాదయాత్రను ముందుకు నడిపారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలంలోని కిష్టారాయణపల్లి క్రాస్ నుంచి ఉదయం 10.30 నిమిషాలకు ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది.
 
మర్రిగూడ మండలం, వట్టిపల్లి, భీమన్నపల్లి కాలనీ, దామెర భీమన్నపల్లి, లెంకలపల్లి క్రాస్, కమ్మగూడెం క్రాస్, దామెర క్రాస్ మీదుగా పాదయాత్ర కొనసాగింది. దామెర భీమన్నపల్లి గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6.00 గంటలకు దామెర క్రాస్ వద్ద ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగిసింది. ఈ రోజు ప్రజాప్రస్థానం పాదయాత్ర 14 కిలోమీటర్లు సాగింది. 
 
గ్రామాల్లో ప్రజలను పలకరిస్తూ వెలుతున్న వైయస్ షర్మిలకి ప్రజల సమస్యలు వారి మాటల్లోనే....
 
అమ్మా మాకు పింఛన్లు రావడంలేదమ్మా. అధికారులను అడిగినా పట్టించుకుంటలేరని చాలా మంది వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల గారు వృద్ధులకు రూ.3000 ఆర్థిక సాయం అందించారు. వారికి భరోసాను కల్పిస్తు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరికీ పింఛన్లు వచ్చేలా చూస్తానని తెలిపారు. (రాములమ్మ, కలగొండి ఎల్లమ్మ, నర్సమ్మ)
 
అమ్మా మాది లక్ష్మణాపురం. మా ఊరితో పాటు ఈదులగండి, కిష్టారాయణపల్లిలో డిండీ ప్రాజెక్టు కింద 1800 ఎకరాలను గుంజుకున్నారు. ఎకరానికి 40లక్షల రూపాయలు మార్కెట్ ధర పలుకుతున్నా వాళ్లు మాకు 4.15లక్షలు మాత్రమే ఇచ్చారు. వాటికి కూడా చెక్ ఇచ్చినందుకు కమీషన్ కింద 5000 రూపాయలు తీసుకున్నారు. కొన్ని గ్రామాల్లో 3లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారమ్మా. పునరావాసాలు కూడా కల్పించలేదు. ధర్నాలు చేసినా అధికారులు, పాలకులు ఎవరూ పట్టించుకోలేదు.

మాకు ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్ట్ కింద ఎకరానికి ఉన్న రేటు కంటే 3 రెట్లు పెంచి డబ్బు ఇవ్వాలి. కానీ ఇప్పటికీ మేము ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. డబ్బులు చెల్లించకుండా డిండీ ప్రాజెక్టు వద్ద పోలీసులను పెట్టి పనిచేయిస్తున్నారమ్మా అంటూ నరేష్ అనే రైతు వాపోయారు. వారి మాటలు విన్న వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల దోపిడీ దారులు, దొంగలు పాలకులుగా ఉన్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రాగానే డిండీ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన ప్రతీ ఒక్క రైతును ఆదుకుంటామని వైయస్ షర్మిల హామీనిచ్చారు.