శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌ను అలా ఉపయోగించేస్తున్నారు

తెలుగు యువహీరో నాగశౌర్యకు చెందిన ఫామ్‌హౌస్‌లో జోరుగా సాగుతున్న పేకాట దందాను నార్శింగి పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఇక్కడ జోరుగా పేకాట సాగుతుందన్న సమాచారంతో ఫామ్‌హౌస్‌లో సోదాలు చేశారు. ఆ సమయంలో అనేక మందిని అరెస్టు చేశారు. 
 
ఇలా పట్టుబడిన వారిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్యాసినోకు ప్రధాన సూత్రధారి అయిన గుత్తా సుమన్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. విచారణలో అతడు కూడా పలు కీలక విషయాలు వెల్లడించాడు. 
 
సుమన్ ఫోన్‌ కాల్స్‌తో పాటు.. కాంటాక్ట్ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల నెంబర్లు ఉండడంతో పోలీసులు విస్తుపోయారు. అయితే, అతడు పంపిన మెసేజ్‌లకు వారి నుంచి స్పందన లేకపోవడంతో సుమన్ వారితో నేరుగా మాట్లాడాడా? లేదంటే మధ్యవర్తులు ఎవరైనా అతడికి సాయం అందించారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
 
అలాగే, గోవాలో క్యాసినో ఆడేందుకు ప్రతి వారం రెండు వందలమందిని, వారి కోసం యువతులను కూడా వెంట తీసుకెళ్లేవాడని తెలుస్తోంది. గోవా క్యాసినోలో డబ్బులు గెలుచుకున్న వారి నుంచి 40 శాతం తీసుకునే వాడని సమాచారం. ముఖ్యంగా జంట నగరాల్లోని హోటళ్లు, ఫామ్ హౌస్‌లను అద్దెకు తీసుకుని అందులో పేకాట, క్యాసినోలను సుమన్ నిర్వహిస్తున్నట్టు విచారణలో తేలింది. 
 
ఇందులో భాగంగానే నార్సింగ్‌లో ఉన్న ఫామ్‌హౌస్‌ను ఒక రోజు కోసం అడిగి తీసుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఆ ఫామ్‌హౌస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గార్గ్‌ది. రెండేళ్ల కోసం యువ హీరో తండ్రి దానిని లీజుకు తీసుకున్నారు. ఆయనతో ఉన్న పరిచయంతో సుమన్ దానిని ఒక రోజు కోసం అడిగి తీసుకున్నాడు.
 
గచ్చిబౌలి పరిధిలోని సుమధుర కాలనీలోని పేకాట స్థావరాలపై రెండు నెలల క్రితం జరిగిన దాడిలోనూ సుమన్ పట్టుబడ్డాడు. అయితే అప్పుడు అతడు ఆటగాడిగా మాత్రమే ఉన్నాడు. సుమన్‌పై పంజాగుట్ట, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, విజయవాడలోనూ కేసులు నమోదై ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. విజయవాడలో తప్ప మిగతా చోట్ల అతడిపై చీటింగ్ కేసులు నమోదు కాగా, విజయవాడలో మాత్రం భూకబ్జా కేసు నమోదు కావడం గమనార్హం.