శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (17:47 IST)

తెలంగాణాలో మాస్క్ పెట్టుకోకుంటే రూ.1000 అపరాధం

తెలంగాణ రాష్ట్రంలో మాస్క్ ధరించకుంటే రూ.1000 అపరాధం విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రాష్ట్రంలో నిత్యం వేల సంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. 
 
ఇప్పటికే ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటపుడు విధిగా మాస్క్ ధరించాలంటూ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ చాలా మంది నిర్లక్ష్యం వహించారు. 
 
అయితే, ఇకపై మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానాగా వడ్డించనున్నారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్-2005, కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సర్కారు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
 
బహిరంగ ప్రదేశాల్లోనూ, ప్రయాణాల్లోనూ, పనిచేసే ప్రదేశాల్లోనూ మాస్కు తప్పనిసరి అని సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తాజా ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలంటూ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు.