బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

చర్లపల్లి వరకు వందే భారత్ రైలు... 8న ప్రారంభం

vande bharat
ఈ నెల 8వ తేదీ నుంచి సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు ప్రారంభంకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైలుకు జెండా ఊపి రైలును ప్రారంభిస్తారు. ఈ నెల 8వ తేదీ సికింద్రాబాద్‌లోని పదో నంబరు ఫ్లాట్‌ఫాంపై ప్రధాని మోడీ రైలును ప్రారంభిస్తారు. ఇందుకోసం వందే భారత్ రైలు ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ తర్వాత భద్రతా సిబ్బందితో కలిసి వందే భారత్ రైలును చర్లపల్లి వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. 
 
పదో నంబరు ప్లాట్‌ఫామ్‌ వద్ద ఉన్న రైల్వే లైనును శుభ్రం చేసి రంగులద్ది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా నారాయణపేట చేనేత వస్త్రదుకాణం, మిల్లెట్‌ స్టాల్‌, జ్యూట్‌, వెదురుతో తయారు చేసిన వస్తువులతో గిరిజన ఉత్పత్తులకు సంబంధించి ట్రైఫెడ్‌ దుకాణానికి అనుమతిచ్చారు.
 
మరోవైపు, ప్రధాని పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఎస్పీజీ స్టేషన్‌ను అధీనంలోకి తీసుకుంది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, రైల్వే పోలీసులు, సాయుధ బెటాలియన్‌ దళాలు, స్పెషల్‌ ఫోర్స్‌ బృందాలు, లోకల్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతో పాటు 500 మంది అధికారుల పర్యవేక్షణలో భద్రత కొనసాగనుంది.
 
సికింద్రాబాద్‌ - తిరుపతి నగరాల మధ్య రాకపోకలు సాగించనున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. 3 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి రెండో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.