1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (09:26 IST)

తెలంగాణాకు కేసీఆర్ ఓ మారీచుడు : రేవంత్ రెడ్డి ధ్వజం

తెలంగాణా రాష్ట్రానికి కేసీఆర్ ఓ మారీచుడులా మారారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. నిజంగానే తెలంగాణా తల్లి సోనియా గాంధీ అని ఆనయ మరోమారు పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఆమేనని స్పష్టం చేశారు.
 
తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని... సోనియాగాంధీనే తెలంగాణ తల్లి అని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా ఫొటో రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
తెలంగాణలో మారీచుడు, రావణాసురుడు కేసీఆర్ అని... కేసీఆర్ ఫాంహౌస్‌లో తెలంగాణ తల్లి బందీ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ, కేసీఆర్ పాలనలో పేదోడు బతికే పరిస్థితి లేదని... కరోనా కంటే వీరిద్దరూ ప్రమాదకరమన్నారు. 
 
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రశాంత్ కిశోర్‌ను సలహాదారుడిగా పెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారని... పాదరసం లాంటి తమ పార్టీ కార్యకర్తలే తమకు పీకేలన్నారు. తమ కార్యకర్తలే ఏకే-47 తూటాలని చెప్పారు.
 
ఇదేసమయంలో... రేవంత్ రెడ్డి సీఎం అంటూ నినాదాలు చేస్తున్న అభిమానులకు ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి నినాదాలు చేస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తానని చెప్పారు. ఇలాంటి నినాదాల వల్ల పార్టీ బలహీనపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుచుకుని పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.