టీఆర్ఎస్లో చేరనున్న టీడీపీ నేత తలసాని శ్రీనివాస్!
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి బలమైన నేతగా గుర్తింపు కలిగిన బీసీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంత పార్టీని వీడి అధికార టీఆర్ఎస్లో చేరేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నట్టు సమాచారం. ఇందులోభాగంగా ఆయన సోమవారం టీ సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. కాగా, గత కొంత కాలంగా తలసాని పార్టీ మారతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తలసాని టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, పార్టీ నేతలతో అంటీ ముట్టనట్టు ఉండడం ఊహాగానాలకు ఊపిరి పోసింది.
ఇదిలావుంటే, హైదరాబాదులోని పద్మారావునగర్ డివిజన్లో ఐడీహెచ్ కాలనీలో ఇళ్లు శిధిలావస్థకు చేరి వర్షాలకు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. వీరి భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. తలసాని టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైందని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటుండగా, ఆయనకు పార్టీ మారే ఆలోచన లేదని, నియోజకవర్గ ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ఆయన కలుస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.