1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (09:14 IST)

రిక్షాలో స్నేహితుడి మృత దేహం.. ఆ నలుగురు అలా..?

UP Man
UP Man
ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా డెడ్‌బాడీలను తరలించడానికి అంబులెన్స్‌లు వేలకు వేలు డిమాండ్ చేసిన విషయం వైరల్‌గా మారింది. దీంతో కొందరు బాధితులు టూవీలర్స్‌లో మోసుకుంటూ డెడ్‌బాడీలను ఇళ్లకు తీసుకెళ్లారు. తాజాగా యూపీకి చెందిన ఓ వ్యక్తి పొట్ట కూటి కోసం తెలంగాణ వచ్చాడు. అంతే అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోయాడు. అతనిని సొంతూరికి తీసుకెళ్లేందుకు డబ్బుల్లేక ఆయన స్నేహితులు రిక్షాపై ఆయన మృత దేహాన్ని తరలించారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కనోజ్‌ జిల్లా ధ్యాస్‌పూర్‌కు చెందిన 37 ఏళ్ల ములకరాజ్‌ పొట్టకూటి కోసం తెలంగాణ వచ్చాడు. నలుగురు స్నేహితులతో కలిసి వచ్చిన అతను... సూర్యపేటలో వ్యాపారం మొదలు పెట్టాడు. అయిటిపాముల వద్ద ఐస్‌క్రీంలు విక్రయిస్తుండగా ప్రమాదం జరిగింది. ఓ టూవీలర్ వచ్చి ఢీకొట్టింది. గాయాలపాలైన అతన్ని నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు సూర్యపేట వెళ్లాలని రిఫర్ చేశారు.
 
ములకరాజ్‌ను పరీక్షించిన సూర్యపేట వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. అయితే భారీ ఖర్చుకు భయపడిన స్నేహితులు.. ఇంటికి తీసుకెళ్లిపోవాలని నిర్ణయించారు.  
 
సొంతూరు వెళ్లిపోయేందుకు ఐదుగురు స్నేహితులు టికెట్లు తీశారు. ట్రైన్ ఎక్కారు కూడా. మంగళవారం ఖమ్మం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కాస్త నలతగా ఉందని ట్రైన్ దిగాడు ములకరాజ్. అక్కేడ విశ్రాంతి తీసుకొని తుది శ్వాస విడిచాడు. మళ్లీ ట్రైన్ ఎక్కుదామని స్నేహితులు పిలుస్తుంటే అతనిలో చలనం లేదు. రైల్వే స్టాఫ్ వచ్చి చూస్తే ఊపిరి ఆగిపోయింది. ములకరాజ్ చనిపోయాడని స్నేహితులకు చెప్పారు.
 
స్నేహితుడు మరణించాడనే విషయం తెలుసుకున్న ఆ నలుగురు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ప్లాట్ ఫాం నుంచి మార్చురీకి తరలించాలని ఆదేశించారు.  
 
చేతిలో ఉన్న డబ్బులతో ఓ రిక్షా కార్మికుడికి రిక్వస్ట్ చేశారు. ఆయన ఐదు వందలు ఇస్తే వస్తానని చెప్పాడు. అందుకు ఓకే చెప్పిన మిత్రులు ఐదు వందలు ఇచ్చారు. ఆ రిక్షాలో మిత్రుడి శవాన్ని వేసుకొని ఆ నలుగురు స్నేహితులు ఖమ్మం ఆసుపత్రికి వచ్చారు. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసి సొంతూరికి పయనమయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపింది.