1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 జనవరి 2023 (14:03 IST)

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు షాకిచ్చిన హైకోర్టు

somesh kumar
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. సోమేష్ కుమర్ తన సొంత కేడర్‌కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఏపీ కేడర్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇపుడు ఆయన తన సొంత రాష్ట్రానికి వెళ్లాలంటూ ఆదేశించింది. ఆయన వ్యక్తిగత న్యాయవాది విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. 
 
కాగా, ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనను కూడా కేంద్రం పూర్తి చేసింది. ఈ కేటాయింపుల్లో భాగంగా, ఏపీ కేడర్‌కు చెందిన సోమేష్ కుమార్ ఆయన సొంత రాష్ట్రానికే కేటాయించింది. దీనిపై సోమేశ్ కుమార్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. 
 
తెలంగాణ రాష్ట్రానికి సోమేశ్ కుమార్ సేవలు అవసరమని భావిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో డిప్యూటేషన్‌పై కొనసాగవచ్చని తెలిపింది. కానీ, ఈ నిర్ణయంపై డీవోపీటీ హైకోర్టును ఆశ్రయించడంతో దీన్ని విచారించిన హైకోర్టు ధర్మాసనం.. గతంలో ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనని తాజాగా తీర్పును వెలువరించింది.