శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: గురువారం, 13 మే 2021 (12:15 IST)

తెలంగాణ లాక్ డౌన్: 2 రోజుల్లో రూ. 282 కోట్ల మద్యాన్ని తాగేశారు

సాధారణ రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రోజుకు 61 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవి.
లాక్ డౌన్ అనగానే రెండు రోజుల్లో 282 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే ఇంచుమించు 4 ఇంతలు ఎక్కువగా అమ్మకాలు జరిపారు.

ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకే మద్యం అమ్మకాలు జరుపుతుండగా మద్యం ప్రియులు మాత్రం వ్యాక్సిన్లు.. కోవిడ్ పరీక్షలు కంటే మద్యం కొనుగోలుకే ఎక్కువ మక్కువ చూపుతున్నారన్నది ఈ రెండు రోజుల మద్యం అమ్మకాలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటల నుండే మద్యం కొనుగోళ్ల కోసం బారులు తీరుతున్నారు..
 
మద్యం సిండికేట్‌కు కాసుల వర్షం
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అంటే కేవలం 4  గంటలు మాత్రమే మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మిగిలిన 20 గంటలు మద్యం దుకాణాలు మూతపడడంతో మద్యం ప్రియులు బెల్టు దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు.
 
ఒక్కో క్వార్టర్‌కు బెల్టు దుకాణాలకు యం.ఆర్.పి కంటే అదనంగా 20 విక్రయించడంతో మద్యం సిండికేట్‌కు కాసుల వర్షం కురుస్తుంది. ఆంధ్రలో బెల్టు దుకాణాలపై  ముఖ్యమంత్రి జగన్ కొరడా ఝలిపించారు. కానీ ..తెలంగాణలో బార్లను రెస్టారెంట్లను లాక్ డౌన్‌తో మూసివేశారు కానీ రేయిపగలు తేడా లేకుండా బెల్టు దుకాణాలను బార్లా తెరిపించారు.
 
బెల్టు దుకాణాల నియంత్రణపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో గల్లీగల్లీలో మద్యం ఏరులై పారుతుంది. 24 గంటలు బెల్టు దుకాణాల్లో మద్యం విక్రయాలు జరుపుతున్నారు, అయినా అధికారులు తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారు.
 
మద్యం ప్రియులు జేబులకు చిల్లు
లాక్ డౌన్ లేని సమయంలో ఓ కూలి వ్యక్తి పొద్దంత పని చేసుకొని ఇంటికి వెళ్లే సమయంలో ఓ క్వార్టర్ సీసా తీసుకొని ఇంటికి వెళ్లి తాగి పడుకునే వారు. అప్పుడు ఆ క్వార్టర్ సీసాకే పరిమితం అయ్యే వారు.
 
ఇప్పుడు లాక్ డౌన్ అమలులో ఉండడంతో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉండడంతో ఉదయం ఓ క్వార్టర్ కొనుగోలు చేసి మధ్యాహ్నానికే అది తాగేస్తున్నారు. సాయంత్రం కాగానే తిరిగి బెల్టు దుకాణాల వైపు పరుగులు పెడుతున్నారు. ఇక్కడ బెల్టు దుకాణాల్లో ఒక్కొక్క క్వార్టర్ పైన బ్రాండ్‌ను బట్టి 30 నుండి 50 రూపాయలు అదనంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
 
ఈ దోపిడీ అంత సిండికేట్ మాఫియా.. ఆబ్కారీ శాఖ అధికారుల కనుసైగల్లోనే జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం మద్యం. కాబట్టే ఆబ్కారీ శాఖ అధికారులు బెల్టు దుకాణాల్లో మద్యం విక్రయించినా.. మద్యం సిండికేట్ యం.ఆర్.పికి అదనంగా విక్రయాలు జరిపినా ఆంధ్రకు భారీగా మద్యం తరలిస్తున్నా పట్టించుకోరు.
 
ఆబ్కారీ అధికారులకు కావాల్సింది అమ్మకాలు... నిర్ణయించిన కోటా (మద్యం అమ్మకాలు) చేయాల్సిందే. మద్యం కొనుగోళ్ల కోసం డి.డిలు తీయండి అని వైన్స్ వ్యాపారులపై ఒత్తిడి తేవాల్సిందే.
 
రిటైల్ షాప్ కోసం లైసెన్స్... సిండికేట్ మాయాజాలంతో హోల్సేల్ విక్రయాలు జరుపుతున్నా, ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. షాపు యజమాని ఒకరైతే అమ్మకాలు జరిపేది ఇంకొకరు.

ఆబ్కారీ మద్యాన్ని అమ్మమంటుంది.
 
పోలీస్ వారు తాగి వాహనం నడిపితే ఊదమంటారు.
 
కోర్టు ఫైన్ కట్టమంటుంది.