తెలంగాణాలో కరోనా కల్లోలం... పాఠశాలలకు సెలవు  
                                       
                  
				  				  
				   
                  				  తెలంగాణా రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అనేక కఠిన ఆంక్షలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. 
				  											
																													
									  
	 
	నిజానికి ప్రతి ఏడాది వేసవి కాలంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం సాధారణమే. అయితే ఈ ఏడాది వేసవి సెలవులను ముందుగానే ప్రకటించారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 
				  
	 
	రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు కాగా, 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని ప్రకటించారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	అలాగే 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ - 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. 
				  																		
											
									  
	 
	ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి రోజుగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో 27 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ఈ తరహా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.