శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (08:44 IST)

టమోటాలు వరంగల్ మార్కెట్ లో అమ్మిన వ్యక్తి మురళి : కొండా సురేఖ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కంపెనీ ప్రొడక్షన్ సమర్పణలో యోయో టాకీస్ పతాకంపై అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలలో మల్లా రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘కొండా’. వరంగల్‌లోని కొండా మురళి మరియు కొండా సురేఖల జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఈ చిత్రం వరంగల్‌లో కొండా మురళి సొంత ఊరు వంచనగిరిలో మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. ‘‘మురళిగారు సైకిల్ మీద టమోటాలు పెట్టుకొని వరంగల్ మార్కెట్ కెళ్ళి అమ్మిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎవరి సపోర్ట్ లేకుండా రాజకీయ నాయకుడిగా ఎదిగాడు.

ఆయన ప్రజాభిమానంతోటే స్వతహాగా ఎదిగాడనేది మన అందరికీ తెలుసు. బయోపిక్ తీయాలంటే ధైర్యం ఉండాలి. మా పైన విమర్శలు చేసే వారిని నేను ఒక్కటే సవాల్ చేస్తున్న మీకు ధైర్యం ఉంటే మీ బయోపిక్‌లు తీసుకోండి. మీ సొంత పైసలు పెట్టే చేయించుకోండి. ఆర్జీవి అన్న లాంటి డైరెక్టర్‌తో తీసుకోండి మేము కాదనము.

మా కథ వెనుక ఒక చరిత్ర ఉంది. మా జీవితాల వెనుక ఒక చరిత్ర ఉంది. మీకు చెప్పుకోవడానికి ఏమీ లేదు మీరందరూ కూడా పెత్తందార్లు, భూస్వాములు, బడుగు బలహీన వర్గాలను అణగదొక్కేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు. ఎంతసేపూ పక్క వాళ్ళను ఎదగనీయకుండా చేసేటటువంటి గుణం ఉన్న వాళ్లే కానీ.. పేదవాడిని ప్రేమించేటటువంటి మనసున్న వ్యక్తి మురళి గారు.

ప్రతి ఒక్కరికి కూడా కాదనకుండా దానమిచ్చే వ్యక్తి. ఈ గ్రామంలో మన అందరికీ తెలుసు స్కూలు, జూనియర్ కాలేజ్, మోడల్ స్కూల్ భూములుగాని ఇవన్నీ ఆయన ప్రజల కోసం ఇవ్వకపోతే కోట్ల రూపాయలను సొమ్ముచేసుకొనే వాడు. డబ్బును ఆశించకుండా తన భూమిని కూడా ఇచ్చేసినటువంటి వ్యక్తి మురళి.

కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు మాత్రం కబ్జాలు చేసి కోట్ల రూపాయల దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వారికి బయోపిక్‌లు తీసే దమ్ము ధైర్యం లేదు. ఆర్.జి.వి గారు మమ్మల్ని గుర్తించి ముందుకొచ్చి కొండా సినిమా చేస్తానని ధైర్యంగా చెబుతున్నారు.

అన్నిటికంటే మంచి కథను ఇస్తున్నాం అని చెబుతున్నాడు. అటువంటి లక్షణాలు మురళిగారిలో ఉన్నాయి కాబట్టే వర్మగారు ముందుకు వచ్చారు అని నేను అనుకుంటున్నాను..’’ అని అన్నారు.