1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (17:24 IST)

శ్రీశైలం జలాశయానికి వరద ముప్పు.. స్పిల్ వే కట్టకపోతే అంతే సంగతులు

srisailam
శ్రీశైలం జలాశయం.. రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకమైన నీటి వనరు. అలాంటి శ్రీశైలం జలాశయానికి ముప్పు పొంచి వుంది. శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వచ్చే వరదను మళ్లించకపోతే.. డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లుతుందని పాండ్యా కమిటీ చెబుతోంది. 
 
ఇలా వరద మళ్లించేందుకు కొత్తగా మరో స్పిల్‌వే నిర్మించాలని కూడా కమిటీ సూచించింది. . ఇప్పుడు ఉన్న స్పిల్‌వే సామర్థ్యానికి తగినట్లు లేదని పాండ్యా కమిటీ వివరించింది.  అలా చేయని పక్షంలో డ్యాం ఎత్తు అయినా పెంచాలని పాండ్యా కమిటీ చెబుతోంది. 
 
డ్యాంకు ఎగువన అదనపు స్పిల్‌వే నిర్మాణానికి అవకాశం ఉందని అక్కడ స్పిల్ వే నిర్మించాలని సూచించింది. కొత్తగా ఏర్పాటు చేసే అదనపు స్పిల్‌వేను అవసరమైతే గండి కొట్టే ఏర్పాటుతో నిర్మించుకోవాలని పాండ్యా కమిటీ సూచించింది.
 
కుడి, ఎడమవైపుల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని పాండ్యా కమిటీ చెప్తోంది. ప్లంజ్‌ పూల్‌‌తో పాటు డ్యాం, స్పిల్‌వేకు సంబంధించిన మరమ్మతులు వెంటనే చేపట్టాలని పాండ్యా కమిటీ చెబుతోంది.
 
అయితే.. ఇలా శ్రీశైలం డ్యాం భద్రత కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ సిఫారసులు ఇవ్వడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఎన్నో కమిటీలు ఏర్పాటు చేసినా.. వాటి సిఫార్సులు మాత్రం అమలు చేయలేదు. ఇక తాజాగా 2020 ఫిబ్రవరిలో ఈ ఎ.బి.పాండ్యా కమిటీ ఏర్పాటైంది.
 
దీంట్లో ఛైర్మన్‌ పాండ్యాతో పాటు పదిమంది నిపుణులు ఉన్నారు. గతంలో ఏర్పాటైన కమిటీల సిఫార్సులను కూడా పరిశీలించి అధ్యయనం చేసిన పాండ్యా కమిటీ తాజాగా అన్ని అంశాలను జోడించి తన తుది నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది.