1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జులై 2021 (11:23 IST)

దంపతుల మధ్య చిచ్చుపెట్టిన టిక్‌టాక్ : భర్త ఆత్మహత్య

ప్రముఖ వీడియో షేరింగ్ యాప్‌లలో ఒకటైన టిక్ టాక్ భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టింది. పొద్దస్తమానం భార్య టిక్ టాక్ వీడియోలు చేస్తుండటంతో భర్తకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో భార్యతో గొడవపడ్డాడు. అప్పటికీ ఆమె మారే సూచనలు కనిపించలేదు. దీంతో మనస్తాపం చెందిన భర్త... బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన ప్రియాంక, ప్రవీణ్ అనే దంపతులు ఉన్నారు. వీరు బాలానగర్ సమీపంలో నివసిస్తుంటారు. టిక్ టాక్‌లో వీడియోలు పోస్టు చేయడం ప్రియాంకకు ఓ వ్యసనంగా మారిపోయింది. 
 
అయితే ఆమె భర్త ప్రవీణ్ అందుకు అభ్యంతరం చెప్పేవాడు. భర్త మాటను లెక్కలోకి తీసుకోని ప్రియాంక టిక్ టాక్‌లో పోస్టులు పెట్టడాన్ని కొనసాగించింది. తాను టిక్ టాక్ స్టార్ అవ్వాలని కలలుగన్న ఆమె ప్రతిరోజు వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడంపై దృష్టి సారించింది.
 
దాంతో భార్యాభర్తల మధ్య కలహాలు తీవ్రమయ్యాయి. తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. భార్య తన మాట వినడంలేదని భావించిన ప్రవీణ్ బలవన్మరణం చెందాడు. దీనిపై ప్రవీణ్ తల్లిదండ్రులు బాలానగర్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ప్రియాంక కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.