1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మే 2021 (12:54 IST)

కరోనా కట్టడికి కఠిన చర్యలు : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, మియాపూర్‌లోని కల్వరి టెంపుల్‌లో ఏర్పాటు చేసిన 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను తెరాస ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తెరాస ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. అంకురా హాస్పిటల్, థెరిస్సా హాస్పిటల్‌ల సౌజన్యంతో ఈ కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇక్కడ కరోనా పేషెంట్లకు చికిత్స, మందులు, నాణ్యమైన భోజనం సహా అన్నీ ఉచితంగానే అందించనున్నారు. 
 
ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు, సానిటైజర్లు తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ సంఖ్యలో కోవిడ్ బెడ్ లు అందుబాటులో ఉంచడంతో పాటు, ఆక్సిజన్, వెంటిలేటర్ లకు ఎలాంటి కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 
 
అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ జ్వర సర్వేను నిర్వహిస్తున్నామన్నారు. కరోనా పేషెంట్లకు ఉచితంగా భోజనం అందిస్తున్న బ్రదర్ సతీష్‌ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. సోమవారం నుండి ఇక్కడ కోవిడ్ పెషెంట్లకు చికిత్స అందించనున్నారు. 
 
నిత్యం 100 కు పైగా వైద్య సిబ్బంది ఈ కోవిడ్ కేర్ సెంటర్‌లో సేవలందించనున్నారు. 300 పడకల ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో, 50 ఆక్సిజన్ బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.