శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2022 (10:56 IST)

తెరపై కనిపించాలన్న కోరికతోనే బాలికలు ఇంటి నుంచి వెళ్లిపోయారు...

girls
ఇటీవల కృష్ణా జిల్లా కంకిపాడు జడ్పీ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినిలు ఇంటి నుంచి పారిపోయారు. వీరిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. టీవీలో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి తన వెంట తీసుకెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. అయితే, బాధిత బాలికల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... నాలుగు ప్రత్యేక బృందాలు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఆ ముగ్గురు బాలికలు బుల్లితెరపై నటించాలన్న కోరికతోనే తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయారని పోలీసులతో పాటు వారు తల్లిదండ్రులు కూడా భావిస్తున్నారు. ఇద్దరు బాలికలకు నటన అంటే అమితాసక్తి. వీరిలో ఒక బాలిక కొన్ని నెలల క్రితం తల్లితో కలిసి ఆడిషన్స్‌ కోసం హైదరాబాద్‌ వెళ్లింది. 
 
చిన్న వయసు కదా కొన్నాళ్ల తర్వాత చూద్దామని అక్కడివారు చెప్పినట్లు తెలిసింది. మరొక బాలిక టిక్‌టాక్‌ చేస్తుంటుంది. సమీపంలో ఉండే జోజి, వీరి ఆసక్తిని గమనించి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఆడిషన్స్‌కు వెళ్లినట్లు, తమకు టీవీల్లో ఆఫర్లు వస్తున్నాయని, త్వరలో వెళ్తున్నట్లు వారం రోజుల నుంచి బాలికలు పాఠశాలలో స్నేహితులకు చెబుతున్నారు. నిందితుడి భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లడంతో, ఇదేఅదనుగా టీవీల్లో నటించేందుకు అవకాశాలు ఇప్పిస్తానని బాలికలను తీసుకెళ్లాడని భావిస్తున్నారు.
 
పైగా, నిందితుడు ముందుగానే ప్రణాళిక రచించుకున్నాడు. తన వెంట రూ.20 వేలు నగదు తీసుకెళ్లాడు. అదృశ్యమైన రోజు విద్యార్థినులు తమ ఆధార్‌ కార్డులను వెంట తీసుకు వెళ్లారు. విద్యార్థినులు పాఠశాల నుంచి వెళ్లే సమయంలో నగదు కోసం వారి వద్దనున్న పాఠ్య పుస్తకాలను బడి సమీపంలోని ఓ పాతవస్తువులు కొనే వ్యాపారికి విక్రయించారు. 
 
మరోవైపు, నిందితుడు ఇంటి నుంచి రైల్వే స్టేషన్ వరకు ద్విచక్రవాహనంపై అక్కడ వాహనాన్ని పార్కింగ్ చేసి, అక్కడ తన మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఈ దృశ్యాలు స్టేషనులోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. దీంతో నిందితుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. 
 
పోలీసులు స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, విజయవాడ నుంచి వెళ్లిన ముగ్గురు ఎక్కడ దిగారు? అక్కడి నుంచి ఎటు వెళ్లారు? అనేది తెలియడం లేదు. నిందితుడు రైల్వే స్టేషనులోనే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. అక్కడితో సిగ్నల్‌ ఆగిపోయింది. దీంతో సమాచారం తెలియక బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.