1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : శనివారం, 2 అక్టోబరు 2021 (23:06 IST)

తెలంగాణలో తాలిబన్ల, రజాకార్ల రాజ్యం కావాలా?.....రామరాజ్యం కావాలా?: బీజేపీ

తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అంతానికి ఆఖరి పోరాటం ఆరంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణలో తాలిబన్ల, రజాకర్ల రాజ్యం నడుస్తోందని అన్నారు. తాలిబన్ల, రజాకార్ల రాజ్యం కావాలా? ప్రజల సంక్షేమానికి పాటుపడే రామరాజ్యం కావాలా?...తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలని కోరారు.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపట్ల ప్రజలు విసిగిపోయారని, బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని చెప్పిన బండి సంజయ్ ప్రజల జోష్ చూస్తుంటే 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరైనా సరే... తొలి సంతకం విద్య, వైద్యంపైనేనని ప్రకటించారు.

రాష్ట్రంలో ఇక ఎవరూ బలిదానాలు చేసుకోవాల్సిన పని లేదని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కొట్టి ప్రజా స్వామిక తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఉద్ఘాటించారు. హిందూ సమాజానికి, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే బీజేపీ ఎట్ట పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.

టీఆర్ఎస్ నాయకులు డిపాజిట్ కోసం పోరాడాల్సిందేనని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర తొలిదశను విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన బండి  సంజయ్  హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు తరువాత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ను మళ్లీ కొనసాగిస్తామని ప్రకటించారు. తొలిదశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ముగింపు సందర్భంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్ర్ముతి ఇరానీతో కలిసి బండి  సంజయ్ హుస్నాబాద్ లో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించారు.

ఎవరూ ఊహంచని రీతిలో హుస్నాబాద్ జన సంద్రమైంది. పట్టణం నలుదిక్కులా రోడ్లపైకి వేలాది మంది జనం తరలివచ్చారు. హుస్నాబాద్ రోడ్లన్నీ జన సంద్రమయ్యాయి.  వారందరికీ అభివాదం చేస్తూ పట్ణణంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన సభ వద్దకు వచ్చారు. వేలాది మంది జనంతో ఇసుక వేస్తే రాలనంతంగా అంబేద్కర్ సర్కిల్ నిండిపోయింది.

ఈ సందర్భంగా జరిగిన సభలో స్మ్రుతి ఇరానీ, బండి సంజయ్ తోపాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, సుద్దాల దేవయ్య, చంద్రశేఖర్, మాజీ ఎంపీ జి.వివేక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, సహ ప్రముఖ్ లు లంకల దీపక్ రెడ్డి, టి.వీరేందర్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ సహా పలువురు నేతలు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ పాదయాత్ర తొలి దశ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలు, కళాకారులకు అభినందనలు తెలిపారు. పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. 

టీఆర్ఎస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్న పలువురు బాధితులు సభకు తరలిరాగా...వారిని వేదికపైకి పిలిచి వారి తరుపున పోరాడేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని ప్రకటించారు.