శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఆగస్టు 2022 (09:17 IST)

విద్యార్థినులతో హెచ్ఎం అసభ్య ప్రవర్తన - చితకబాదిన గ్రామస్థులు

attack
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని గ్రామస్థులు చితకబాదారు. తన వద్ద చదువుకునే విద్యార్థినిలు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో గ్రామస్థులంతా కలిసి హెచ్ఎంను పట్టుకుని చితకబాదారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులను స్కూలు ఉపాధ్యాయులు ఈ నెల 18వ తేదీ "గాంధీ" అనే చిత్రానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సలాది రామారావు విద్యార్థినిలు పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. తాను సగం తాగిన కూల్‌డ్రింక్‌ను విద్యార్థినిలు తాగాలని బలవంతం చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత హెచ్ఎం తమ పట్ల నడుచుకున్న తీరుని బాధిత విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పారు. 
 
దీంతో వారు ఆగ్రహోద్రక్తులై గ్రామస్థులతో కలిసి హెచ్ఎంను పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత గ్రామ సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించారు. సమాచారం, తెలుసుకున్న పోలీసులు గ్రామంలోని సర్పంచ్ ఇంటికి చేరుకుని హెచ్ఎంను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలోనూ ఆయన్ను అడ్డుకుని, మరోమారు చితకబాదారు. 
 
చివరకు హెచ్ఎంను పోలీసులు జాగ్రత్తగా ఠాణాకు తరలించారు. అయితే, రామారావు తమ గ్రామంలో పని చేయడానికి వీల్లేదని గ్రామస్థులు తెగేసి చెప్పారు. దీంతో డిప్యుటేషన్‌పై వేరే ప్ర్రాంతానికి వెళ్తానని లేదంటే సెలవులో ఉంటానని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు. మరోవైపు, ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.