1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఏప్రియల్ 2021 (12:20 IST)

మరో మూడు రోజుల్లో పెళ్లి... కరోనాతో ప్రభుత్వ టీచర్ మృతి..

కరోనా ప్రజల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా మరో రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ప్రభుత్వ టీచర్ కరోనాబారిన పడి మృత్యువాతపడడం ఆ కుటుంబంలో విషాదం నింపింది. 28 ఏళ్ల యువకుడు. ప్రభుత్వ స్కూల్లో టీచర్.

ఇంకేముంది జీవితంలో స్థిరపడ్డానన్న సంబరంలో పెళ్లికి సిద్ధమయ్యాడు. అంతా  అనుకున్నట్టుగానే జరిగింది. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత అంతా భావించినట్టుగానే పెళ్లి ముహుర్తాలు పెట్టుకున్నారు. మే 2న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. 
 
కాని విధి వక్రీకరించింది.. కరోనా సెకండ్ వేవ్ అతని ఆశలపై నీళ్లజల్లింది. కరోనా కబలించింది. దీంతో వారం క్రితం పరీక్షలు చేయించుకున్న యువకుడు పాజిటీవ్ అని నిర్థారణ కావడంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం ప్రాణాలు విడిచాడు. 
 
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలంలోని మాన్యానాయక్ తండాలో ఈ ఘటన జరిగింది. కర్ర గణపతి చౌహాన్ అనే యువకుడు మెదక్ జిల్లాలోని గడిపెద్దాపూర్ జడ్పీ హైస్కూల్‌లో.. అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తుండగా కరోనా కాటుకు బలయ్యాడు. అన్ని బాగుంటే మరో మూడు రోజుల్లో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకున్న గణపతి చౌహాన్ మృత్యువాత పడ్డాడు.