శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: బుధవారం, 28 ఏప్రియల్ 2021 (22:27 IST)

కోవిడ్: భారతదేశంలో కరోనా కల్లోలం ప్రపంచాన్ని ఎందుకు కలవరపెడుతోంది

భారతదేశంలో కోవిడ్ బాధితులు అనుభవిస్తున్న కష్టాలను ప్రతిబింబించే చిత్రాలు, వీడియోలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. కానీ, ఈ సంక్షోభం ఒక్క భారతదేశానిది మాత్రమే కాదు. ఇది ప్రతి ఒక్కరికి ముప్పే. "ఈ వైరస్‌కు ఎల్లలు లేవు.. ఏ దేశం, ఏ మతం, ఆడా? మగా? వంటివేమీ చూడదు" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు.

 
ఇప్పుడు భారతదేశంలో నెలకొన్న పరిస్థితిని ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికే చవిచూశాయి. ప్రపంచం మొత్తం ఎలా కనెక్ట్ అయి ఉందో ఈ మహమ్మారి చూపించింది. ఏదైనా ఒక దేశంలో ఇన్ఫెక్షన్ స్థాయి తీవ్రంగా ఉంటే అది కచ్చితంగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ప్రయాణ నిబంధనలు, పరీక్షలు, క్వారంటైన్ లాంటి నిబంధనలు ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ మాత్రం వ్యాప్తి చెందుతూనే ఉంది.

 
వైరస్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల నుంచి ఎవరైనా ప్రయాణిస్తే వారి ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటోంది. ఇటీవల దిల్లీ నుంచి హాంకాంగ్ వెళ్లిన విమానంలో 50 మంది ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. భారతదేశంలో ఉన్న కోవిడ్ వేరియంట్ గురించి మరో ఆందోళన ఉంది. భారతదేశంలో బి.1.617 అనే కొత్త వేరియంట్ కనిపిస్తోంది. వైరస్ ఉపరితలంపై రెండు రకాల కీలకమైన మ్యుటేషన్లు ఉండటంతో దీనిని కొందరు డబుల్ మ్యూటెంట్ అంటున్నారు.

ఇది చాలా వేగంగా వ్యాప్తి చెంది వైరస్ నిరోధించేందుకు యాంటిబాడీలకు కష్టంగా మారుతుందని ల్యాబ్ ఆధారాలు చెబుతున్నాయి. అయితే, ఈ మ్యూటెంట్ వల్ల ఎంత రోగ నిరోధక శక్తి కోల్పోతారనే విషయంపై శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేస్తున్నారు. "అయితే, ఈ వైరస్‌ని వ్యాక్సిన్లు ఎదుర్కోలేవు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు" అని వెల్కమ్ సాంగర్ ఇనిస్టిట్యూట్‌లో కోవిడ్ 19 జెనోమిక్స్ ఇనిషియేటివ్ డైరెక్టర్ డాక్టర్ జెఫ్ బారెట్ అన్నారు.

 
"దీనిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని, కానీ, ప్రస్తుతానికి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని ఆయన అన్నారు. కానీ, దేశంలో కేసులు పెరిగే కొద్దీ కొత్త వేరియంట్‌లు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రతి ఇన్ఫెక్షన్ వల్ల వైరస్ మరింత వృద్ధి చెంది కొత్త మ్యుటేషన్లు వచ్చే అవకాశం ఉంది. వీటి వలన వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోతుందేమో అనే భయం కూడా ఉంది.

 
"అయితే, ఈ వైరస్ వృద్ధి చెందకుండా చూడటం వల్ల ఈ కొత్త వేరియంట్లు పుట్టకుండా చూడవచ్చు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగాన్ని అరికట్టడం ద్వారా వేరియంట్లను అరికట్టవచ్చు" అని కోవిడ్ 19 జెనోమిక్స్ యూకే కన్సార్టియం (సిఓజి -యూకె) డైరెక్టర్ ప్రొఫెసర్ షారన్ పీకాక్ అన్నారు. లాక్ డౌన్లు, భౌతిక దూరం పాటించడం ద్వారా వైరస్ చాలావరకు అరికట్టవచ్చు. కానీ, వైరస్ అరికట్టేందుకు వ్యాక్సినేషన్ కీలక పాత్ర వహిస్తుంది.

భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. ఇప్పటివరకు తొలి డోసు వ్యాక్సీన్‌ని 10 శాతం మంది తీసుకోగా, రెండు డోసుల వ్యాక్సీన్‌ని 2 శాతం కంటే తక్కువ మంది తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా వ్యాక్సీన్ ఉత్పత్తి చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇక్కడే ఉండటం వల్ల కూడా ఇక్కడ పెరుగుతున్న కేసుల సంఖ్య ప్రపంచ దేశాల మీద ప్రభావం చూపిస్తుంది.
 
మార్చి నెల నుంచి దేశంలో ఇన్ఫెక్షన్లు పెరుగుతూ ఉండటంతో అధికారులు ఆస్ట్రా జెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సీన్ ఎగుమతులను కొంత కాలంపాటు నిలిపివేశారు. అందులో అల్పాదాయ, మధ్య స్థాయి ఆదాయాలు ఉన్న దేశాలకు యూఎన్ ఆమోదించిన కోవాక్స్ పథకం కింద అందించాల్సిన వ్యాక్సిన్లు కూడా ఉన్నాయి. ఇందులో భాగస్వామి అయిన గ్లోబల్ వ్యాక్సీన్ అలియన్స్ (గావి ) కూడా భారతదేశం నుంచి తిరిగి సరఫరాలు ఎప్పుడు మొదలవుతాయా అని వేచిచూస్తోంది.
 
ఈ నిలుపుదల చాలా దేశాల్లో వ్యాక్సీన్ నిర్వహణ కార్యక్రమంపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతానికి భారతదేశంలో తయారయ్యే వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుతూ ముందుగా దేశీయ వాడకానికి ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని చూస్తుంటే ఇది ప్రాధాన్యాంశమని కూడా అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
"ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను రెట్టింపు వేగంతో చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడానికి ప్రయత్నిస్తుంది" అని స్వామినాథన్ అన్నారు. ఈ వైరస్ ఒక దేశం తర్వాత మరొక దేశాన్ని కబళిస్తూ ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి తగ్గుతున్న సూచనలు ఏవీ కనిపించడం లేదు. ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితి మాత్రం ప్రపంచంలో అందరూ సురక్షితంగా ఉండేవరకు మనం ఎవరమూ సురక్షితం కాదనే విషయాన్ని గుర్తు చేస్తోంది.