మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (08:48 IST)

వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు ఇదే.. ఆత్మీయులతో మంతనాలు!

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్. షర్మిల కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమైపోయింది. ఇదే అంశంపై ఆమె మంగళవారం తన మద్దతుదారులతో హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తనకు అత్యంత సన్నిహితులైన నేతలతో కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
 
ముఖ్యంగా, తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్తగా స్థాపించనున్న పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ఆమె నామకరణం చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు పార్టీ పేరు రిజిస్టర్‌ కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని షర్మిల బృందం సంప్రదించినట్లు చెబుతున్నారు. మార్చి నాటికి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. 
 
ఇదే అంశంపై ఆమె తన సన్నిహితుల వద్ద మాట్లాడుతూ, మన పార్టీ పేరు వైఎస్ఆర్ టీపీ (వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ పార్టీ), దీని జెండా, ఎజెండా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయన్నారు. వైఎస్సార్‌ అంటే ఆంధ్రా పార్టీ అనే అభిప్రాయం ఉంటుంది కదా? అని జిల్లా నేతలు ప్రశ్నించగా, 'వైఎస్సార్‌ అంటే తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే పార్టీ పేరు వైఎస్సార్‌టీపీగా పెడతాం' అని షర్మిల బదులిచ్చారు. 
 
'అన్న ఇప్పటికే ఆంధ్రాలో సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తెలంగాణలో సీఎం కాలేడు. అందుకే నేను ప్రత్యేక పార్టీ పెడుతున్నా.. లీడ్‌ తీసుకుంటున్నా, ఒక చెల్లికి అన్న ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, విభేదాలు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి' అని ఆమె నేతలతో వ్యాఖ్యానించినట్టు సమాచారం.