1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 జులై 2021 (17:10 IST)

కె.కవిత చొరవ - నిజామాబాద్‌ ఆస్పత్రికి యువరాజ్ సింగ్ వితరణ

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోమారు పెద్ద మనసు చాటుకున్నారు. కేన్సర్ బారినపడిపూర్తిగా కోలుకున్న ఆయన.. ఇపుడు ఇతరులకు సేవ చేసే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రూ.2.50 కోట్ల విలువ చేసే పడకలను సమకూర్చారు. ఎమ్మెల్సీ కె.కవిత తీసుకున్న చొరవ కారణంగా యువరాజ్ సింగ్ సాయం చేశారు. మొత్తం 120 ఐసీయూ పడకలను ఆస్పత్రికి సమకూర్చేందుకు యువరాజ్ సింగ్ ముందుకువచ్చారు. ఈ పడకలను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి బుధవారం ప్రారంభించగా వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో యువరాజ్ పాల్గొన్నాడు.
 
కాగా, నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి దేశ స్దాయిలో గుర్తింపు సాధించింది. కోవిడ్ సమయంలో కరోనా పేషెంట్లకు వైద్య సిబ్బంది చేసిన సేవలను క్రికెటర్ యువరాజ్ సింగ్ గుర్తించాడు. మరింత మెరుగైన వైద్యం అందిచేందుకు వీలుగా తన ఫౌండేషన్ తరపున రూ.2.5 కోట్లు విలువ చేసే 120 ఐసీయూ బెడ్లను అందచేశాడు. 
 
ఈ మేరకు యూవీకేన్ ఫౌండేషన్ సభ్యులు జిల్లా ఆసుపత్రిలోని రెండు వార్డులలో ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ చాలామంది జీవితాల్లో చీకట్లు నింపిందని.. థర్డ్‌వేవ్‌లో అలాంటి విపత్కర పరిస్థితులు రావొద్దనే తన ఫౌండేషన్‌తో ఈ బెడ్స్ ఏర్పాటు చేసినట్లు యువరాజ్ చెప్పుకొచ్చాడు.