శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 8 ఆగస్టు 2019 (14:33 IST)

థర్టీ ఇయర్స్ పృధ్వీ గ్యాప్‌ను ఫిల్ చేస్తానంటున్నాడట బండ్ల గణేష్.. ఎలా?

సాధారణంగా ఎవరైనా సినీరంగంలో ఉంటూ రాజకీయాల్లోకి వెళతారు. ఎందుకంటే తమకున్న చరిష్మాతో ప్రజాప్రతినిధి కొనసాగవచ్చన్నది వారి ధీమా. ఇలాగే చాలామంది నటులు రాజకీయాల్లోకి వెళ్ళారు. కానీ కమెడియన్ బండ్ల గణేష్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. సినీనటుడిగా ఉన్న బండ్ల గణేష్ నిర్మాత అయ్యాడు..ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ నాయకుడే అయిపోయాడు.
 
గత కొన్నినెలలకు ముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బండ్ల గణేష్ చేసిన హడావిడి అంతాఇంతా కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో గెలవకపోతే బ్లేడుతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. ఇది కాస్త తీవ్ర చర్చకు దారితీసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను బండ్ల గణేష్ గురించి మాట్లాడుకునే వారే ఎక్కువయ్యారు.
 
అయితే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడం.. ఆ తరవాత బండ్ల గణేష్ రాజకీయాలకు దూరమైపోవడం జరిగిపోయాయి. అయితే మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్న బండ్ల గణేష్ మళ్లీ సినిమాలవైపు చూస్తున్నారు. మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో కమెడియన్‌గా బండ్ల గణేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. 
 
ఇక నటుడిగానే తాను కొనసాగుతానని, తనకు ఈ రాజకీయాలు వద్దని దణ్ణం పెడుతున్నారు బండ్ల గణేష్. ఎలాగూ 30 ఇయర్స్ పృధ్వీ ఎస్వీబీసిలో సెటిల్ అయిపోవడంతో ఆ గ్యాప్‌ను తను ఫిల్ చేస్తానని బండ్ల అంటున్నారట. మరి 30 ఇయర్స్ పృధ్వీ ఏ చేస్తారో?