గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 మే 2020 (15:18 IST)

చిక్కుల్లో శ్యామ్ కె నాయుడు... పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఫిర్యాదు (video)

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యాక్ కె నాయుడు చిక్కుల్లో పడ్డారు. ఈయనపై హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. శ్యామ్ కె నాయుడు తనను మోసం చేసినట్టు ఓ సినీ నటి ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా, పెళ్లి చేసుకుంటానని, ప్రమాణం చేసి, ఇపుడు మోసం చేశాడని ఆమె అందులో పేర్కొంది. ఆ నటి పేరు సాయిసుధ. ఈమె ఫిర్యాదుతో శ్యామ్ కె నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు తమ్ముడే శ్యామ్ కె నాయుడు. బిజినెస్ మెన్, పోకిరి, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి ఎన్నో చిత్రాలకు ఆయన పని చేశారు. 'అర్జున్ రెడ్డి' చిత్రంలో సాయి సుధ సపోర్టింగ్ రోల్ పోషించింది. శ్యామ్ కె నాయుడిపై కేసు నమోదు కావడంతో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 
 
అయితే, ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడేందుకు సాయిసుధ నిరాకరించింది. ఒకవేళ శ్యామ్ కె నాయుడుపై పోలీసులు చర్య తీసుకోని పక్షంలో అపుడు మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు బహిర్గతం చేస్తానని తెలిపింది.