1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2020 (14:39 IST)

సినీ కార్మికులను ఆదుకునేందుకు అమితాబ్ 'బిగ్' ప్లాన్

దేశంలో కరోనా వైరస్ కారణంగా సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ లాక్‌డౌన్ కారణంగా అన్ని రకాల సేవలు బంద్ అయ్యాయి. సినిమా షూటింగ్‌లు కూడా రద్దు అయ్యాయి. దీంతో సినీ రంగాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తూ వచ్చిన లక్షలాది మంది దినకూలీలు, కార్మికులు ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ పెద్దలు నడుంబిగించారు. 
 
అలాంటివారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒకరు. ఈయన తన వంతుగా లక్ష మంది కార్మికులకు సాయం చేస్తానని ప్రకటించారు. ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫెడరేషన్‌లో సభ్యులుగా ఉన్న లక్షమంది దినసరి సినీ కార్మికుల కుటుంబాలకు నెలవారీ రేషన్‌ను అందిస్తామని ప్రకటించారు. 
 
అమితాబ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి సోనీ పిక్చర్స్ నెట్ వర్క్, కల్యాణ్ జ్యువెలర్స్‌లు తమవంతు సహకారం అందించనున్నాయి. ఈ విషయాన్ని సోనీ పిక్చర్స్ నెట్‌‌వర్క్ ధృవీకరించింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్ష మంది ఫిల్మ్, టెలివిజన్ కార్మికుల కుటుంబాలకు సాయం చేస్తామని ప్రకటించింది. 
 
అయితే, ఆ కుటుంబాలకు ఎప్పటి నుంచి రేషన్ సరుకులు అందిస్తారన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు. సోనీ పిక్చర్స్ తరపున కనీసం 50 వేల మంది కార్మికులు, వారి కుటుంబాలకు ఒక నెల సరుకులు ఇస్తామని ఆ సంస్థ సీఈవో ఎన్పీ సింగ్ తెలిపారు. ఇపుడు అమితాబ్ కూడా నెలవారీ రేషన్ సరుకులు ఇస్తామని ప్రటించారు.