1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (21:40 IST)

భోళాశంకర్ నిర్మాతలకు రూ. 50 కోట్లు నష్టమా? కేసు పెట్టి వారి వెంటబడుతున్న డిస్ట్రిబ్యూటర్

Bhola shankar
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. దీనితో ఆ చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర భారీగా రూ. 50 కోట్ల వరకూ నష్టపోయారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలే నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇప్పుడు ఆయా డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలపై కేసులు పెట్టి తమ డబ్బును ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
 
తాజాగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సతీష్ భోళాశంకర్ నిర్మాతలపై చీటింగ్ కేసు పెట్టారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటీషన్ వేసాడు. తనను గతంలో అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో మోసం చేసారనీ, ఆ సమయంలో వారికి రూ. 30 కోట్లు చెల్లించినట్లు వెల్లడించాడు. తనకు మూడు రాష్ట్రాల హక్కుల డిస్ట్రిబ్యూషన్ ఇస్తానని చెప్పి చివరికి వైజాగ్ మాత్రమే ఇచ్చారనీ, అదేమని అడిగితే భోళా శంకర్ విడుదలకి ముందు డబ్బు ముట్టజెపుతామన్నారని తెలిపారు. ఇప్పుడు ఆ డబ్బు గురించి అడిగేందుకు ప్రయత్నిస్తే తనతో మాట్లాడేందుకు కూడా వారు సిద్ధంగా లేరనీ, అందువల్ల వేరే మార్గం లేక కోర్టులో కేసు వేసినట్లు చెప్పుకొచ్చారు.