మహావతార్ నరసింహ: పురాణాలకు దగ్గరగా వుంది.. మహావతార్ నరసింహ అవతారాన్ని చూసినట్లుంది (video)
యానిమేటెడ్ సినిమా మహావతార్ నరసింహ కలెక్షన్ల పరంగా కుమ్మేస్తుంది. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది.
తాజాగా ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఈ సినిమాని వీక్షించారు. అల్లు అరవింద్, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డితో కలిసి థియేటర్లో ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మూవీపై స్పందించారు.
"మన పురాణాలకు చాలా దగ్గరగా ఈ సినిమా ఉంది. భక్త ప్రహ్లాద సినిమాలా ఇది కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. మనుషులతో కాకుండా బొమ్మలతో తీశారు. కానీ ఆ భక్తి, ఆ భావం, ఆ అనుభూతి మాత్రం నిజంగా ఆధ్యాత్మికంగా అనిపించింది.
ఈ సినిమా చూస్తుంటే నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగింది. ముఖ్యంగా చివరి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు" అని అన్నారు. గీతా ఆర్ట్స్, హోంబలే ఫిల్మ్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో మూవీపై చాగంటి కోటేశ్వరరావు ఇచ్చిన రివ్యూ వీడియోను పంచుకున్నాయి.