1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (13:20 IST)

చిరంజీవి "విశ్వంభర"లో హీరోయిన్‌గా చెన్నై చంద్రం

trisha
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం "విశ్వంభర". ఈ చిత్రం కోసం హీరోయిన్‌ను చిత్ర బృందం ఎంపిక చేసింది. గత యేడాది దసరా పండుగ రోజున ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. "విశ్వానికి మించి.." అంటూ ఆసక్తికరమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుంది. చిత్ర బృందంతో చిరంజీవి జాయిన్ అయ్యారు. తాజాగా హీరోయిన్‌గా త్రిషను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. 
 
నిజానికి ఈ చిత్రంలో చిరంజీవి సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్‌ నటించనున్నారనే వార్తలు వచ్చాయి. వాటికి చెక్‌ పెడుతూ స్టార్ హీరోయిన్ త్రిషను ఖరారు చేసింది చిత్రబృందం. ఆమె 'విశ్వంభర' సెట్‌లోకి అడుగుపెడుతోన్న వీడియోను పంచుకొని నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని కన్ఫామ్‌ చేసింది. 
 
2006లో విడుదలైన 'స్టాలిన్‌'లో చిరు - త్రిషల జోడి వినోదాన్ని పంచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించనున్నారు. దీంతో మెగా అభిమానులు సంబరపడుతున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ఇది రూపుదిద్దుకుంటుంది. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతోంది. దీని కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. 
 
2025 జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఇది రానుంది. దీనితో పాటు చిరంజీవి తన కుమార్తె సొంత నిర్మాణ సంస్థ 'గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌'పై 157వ సినిమా చేయనున్నారు. అలాగే హరీశ్‌ శంకర్‌తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.