గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి ఛిఛిలి
Last Modified: శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:29 IST)

చిన్నారుల విద్యపై మంచు అక్కకు ఎంత బాధ్యతో...

మంచు లక్ష్మి అనేది తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. అప్పుడప్పుడూ సినిమాలలో కనిపించడంతో పాటుబా బుల్లితెరలో కొన్ని షోలు చేస్తున్నారు. ఆవిడ చేసిన "మేము సైతం" అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది సహాయం పొందారు. సామజిక సమస్యలపై కూడా మంచు లక్ష్మి తనదైన శైలిలో స్పందిస్తూ చురుకుగా ఉంటున్నారు. అయితే మరో సామాజిక మార్పుకు పెద్ద పీట వేస్తూ చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించే బాధ్యతను తీసుకున్నారు. 
 
సాఫ్ట్‌వేర్ రంగంలో సేవలందిస్తున్న లీడింగ్ కంపెనీ పెగా సిస్టమ్స్‌తో కలిసి సంయుక్తంగా టీచ్ ఫర్ ఛేంజ్ ద్వారా నేషనల్ వైడ్‌గా తమ సేవలను విస్తరించనున్నట్లు ప్రకటించారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం వలన చదువుకోలేని చిన్నారులకు చదువు చెప్పించడంతో పాటుగా వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా దీనిని రూపొందించినట్లు తెలిపారు. 
 
ప్రభుత్వ పాఠశాలలో చదివే వివిధ సామాజిక వర్గాలకు చెందిన 3 నుండి 5 ఏళ్లలోపు పిల్లలకు టీచ్ ఫర్ ఛేంజ్ ఎన్జీవోలో శిక్షణ పొందిన వాలంటీర్లు విద్యను బోధిస్తారు. 2014లో మంచు లక్ష్మి స్థాపించిన ఈ ఎన్జీవో ఇప్పటికే హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లలో తమ కార్యాచరణలను నిర్వహిస్తోంది, ఇక ఏడాది నుండి ముంబై, ఢిల్లీ, లక్నో, చెన్నైలో కూడా సేవలు అందించనుంది. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జయాబచ్చన్‌, రేణుకా చౌదరి, మూన్‌ మూన్‌ సేన్‌, గీతారెడ్డి, డాక్టర్‌ మోహన్‌బాబుతో పాటు ఆదితి రావు హైద్రీ, సునీల్‌ సేథ్‌, తాప్సీ పన్ను, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రియా చక్రబర్తి, రెజీనా కసాండ్రాతో పాటుగా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. మీరు కూడా వాలంటీర్లుగా మారి విద్య బోధించాలనుకుంటే, teachforchange.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.