గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (08:01 IST)

'మనసు మమత' టీవీ సీరియల్ నటి శ్రావణి బలవన్మరణం...

'మౌనరాగం', 'మనసు మమత' వంటి టీవీ సీరియల్స్‌లో నటించిన నటి శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. ఫ్రియుడి వేధింపులు భరించలేక ఆమె తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నగరంలోని మధురవాడలో నివాసం ఉంటోంది. అక్కడే గత రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. 
 
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. టిక్‌టాక్ ద్వారా ఇటీవల శ్రావణికి కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో పరిచయమైంది. స్నేహం కాస్తా ప్రేమకు దారితీసింది. 
 
తనకు తల్లిదండ్రులు లేరని చెప్పి శ్రావణికి మరింత దగ్గరయ్యాడు. డబ్బుల కోసం దేవరాజు వేధించేవాడని శ్రావణి కుటుంబ సభ్యులు తెలిపారు. అతడి వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.
 
శ్రావణిని ప్రేమిస్తున్నట్టు నమ్మించి ఆమెతో సన్నిహితంగా ఉంటూ దేవరాజ్ ఫొటోలు తీసుకున్నాడని, తర్వాత ఆ ఫొటోలు బయటపెడతానంటూ డబ్బులు డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. అతడి వేధింపుల తీవ్రం కావడంతో ఇటీవల ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో శ్రావణి ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు.
 
అయినప్పటికీ వేధింపులు ఆపకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. శ్రావణి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్యకు కారణమైన దేవరాజ్‌ను కఠినంగా శిక్షించాలని శ్రావణి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.