సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (19:30 IST)

పరస్పరం నోరుపారేసుకున్న మోహన్ బాబు - మంచు మనోజ్!!?

manoj - mohan babu
కుటుంబ ఆస్తి తగాదాల విషయంలో ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు, మంచు మనోజ్‌‌‌లు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లోని జిల్లా సమీకృత కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం ఇద్దరూ వచ్చారు. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ కొద్దిరోజుల క్రితం తన ప్రతినిధితో మోహన్‌బాబు లేఖ పంపించారు.
 
ఇందులో బాలాపూర్‌ మండలం జల్‌పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి మనోజ్‌ అక్రమంగా ప్రవేశించి తన ఆస్తులను ఆక్రమించుకున్నారని, వాటిని తనకు తిరిగి ఇప్పించాలని అందులో పేర్కొన్నారు. మోహన్‌బాబు వేసిన పిటిషన్‌పై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ఎదుట ఇటీవల మంచు మనోజ్‌ హాజరై వివరణ ఇచ్చారు. 
 
తాజాగా సోమవారం మోహన్‌బాబు, మనోజ్‌ ఇద్దరూ కలెక్టర్‌ వద్దకు వచ్చారు. తన ఆస్తులను మనోజ్‌ అక్రమంగా ఆక్రమించారని మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. 'నా స్వార్జిత ఆస్తిపై ఎవరికీ హక్కు లేదు. మనోజ్‌ నా ఆస్తులు నాకు అప్పగించాలి' అని మోహన్‌బాబు స్పష్టంచేశారు. 
 
ఈ సందర్భంగా తండ్రీకొడుకులు మెజిస్ట్రేట్ ఎదుట పరస్పరం దూషించుకుని, ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు. ఆస్తి తగదాకి సంబంధించి ప్రతిమ సింగ్‌కు పూర్తి వివరాలు అందజేశారు. ఆ తర్వాత మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మోహన్ బాబు, మంచు మనోజ్‌లు ఇంటికి వెళ్లిపోయారు. 
 
ఈ ఆస్తి తగాదా అంశంలో సుమారు 2 గంటల పాటు సాగిన మెజిస్ట్రేట్ విచారణ జరిగింది. ఆ తర్వాత మంచు మనోజ్ మీడియా మాట్లాడకుండా ఆవేశంతో వెళ్లిపోయారు. ఇదే కేసులో వచ్చేవారం మరోమారు తమ ఎదుట హాజరుకావాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు.