గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (09:54 IST)

రియా నోటి వెంట ఎవరి పేర్లూ రాలేదు : ఎన్.సి.బి

డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లను నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి వెల్లడించినట్టు వచ్చిన వార్తలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కొట్టిపారేసింది. ఇదే అంశంపై ఎన్.సి.బి డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా స్పందిస్తూ, ఎన్.సి.బి జరుపుతున్న విచారణలో రియా చక్రవర్తి ఎవరి పేర్లనూ చెప్పలేదని తెలిపారు.
 
తమ వద్ద నిందితులు, బాధితుల జాబితా ఏమీ లేదంటూ ఎన్సీబీ కీలక ప్రకటన చేసింది. దాదాపు 25 మంది పేర్లను ఎన్సీబీ అధికారుల ముందు రియా చెప్పిందని, వారందరికీ వరుసగా నోటీసులను జారీ చేసి, విచారిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు బాలీవుడ్‌లో కలకలం రేపాయి. ఈ డ్రగ్స్ దందాలో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉందని వార్తలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో తాజాగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా ఓ ప్రకటన విడుదల చేశారు. రియా నోటి నుంచి ఎవరి పేర్లూ రాలేదని స్పష్టంచేశారు. తాము కేవలం డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి జాబితానే తయారు చేశామని, దాన్నే సినీ పరిశ్రమ జాబితాగా పొరపడ్డారేమోనని అన్నారు. సినీ పరిశ్రమపై జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రమూ నిజం లేదని ఈ ప్రకటనలో కేపీఎస్ మల్హోత్రా పేర్కొనడం గమనార్హం.