బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (19:59 IST)

అడ్డంగా బుక్కైన వర్మ, అమృత ఆర్జీవిని కోర్టు బోనులో నిలబెడుతుందా? (video)

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం మర్డర్. అమృత, ప్రణయ్, మారుతీరావు కథాంశంతో వర్మ మర్డర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. తనదైన శైలిలో ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసారు. అయితే... ఈ సినిమాపై అమృత కోర్టును ఆశ్రయించారు. దీంతో, అమృత పిటిషన్‌కు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఇప్పటికే వర్మకు ఆదేశాలను జారీ చేసింది.
 
అయితే.. వర్మకు కరోనా సోకిందని... అందువల్ల అఫిడవిట్ పైన సంతకం చేయలేకపోయారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 14కి కోర్టు వాయిదా వేసింది.
 
 కోర్టుకు తనకు కరోనా సోకిందనే విషయం చెప్పారనే విషయం మరిచిపోయాడో ఏంటో కానీ.. తనకు కరోనావైరస్ లేదని, ఈ విషయం తన గురించి ప్రచారం చేస్తున్న వారికి బాధను కలిగించే అంశమంటూ ఇటీవల వర్మ ట్వీట్ చేసారు.
 
ఈ ట్వీట్‌తో వర్మ అడ్డంగా దొరికిపోయారు. కోర్టుకు వర్మ తప్పుడు సమాచారం అందించారని అమృత ఆరోపించారు. తనకు కరోనా సోకలేదనే విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారని చెప్పారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని అమృత తరపు లాయర్ తెలిపారు. మరి.. కోర్టు ఎలా స్పందిస్తుందో..? వర్మ ఎలా ఏం సమాధానం చెబుతారో..? చూడాలి.