1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (12:33 IST)

హమ్మయ్య... రియా చక్రవర్తికి ఊరట... సుశాంత్‌కు ఆ వ్యాధి ఉందా?

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన మాదక ద్రవ్యాల కేసులో అరెస్టు అయిన నటి రియా చక్రవర్తికి ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరైంది. ఈ మేరకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
దీంతో సెప్టెంబరు 8వ తేదీన అరెస్టు అయిన రియా, దాదాపు నెల రోజుల తర్వాత బయటకు రానుంది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 20 వరకూ పొడిగిస్తూ, స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజునే హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేయడం గమనార్హం.
 
కాగా, తన బెయిల్ పిటిషన్లో, సుశాంత్ సింగ్, తనకు అలవాటైన డ్రగ్స్ కోసం సన్నిహితులను సంప్రదించేవాడని, ఆ కారణంతోనే తాను, తన సోదరుడు నార్కోటిక్స్ అధికారులకు టార్గెట్‌గా మారామని వాపోయారు. 
 
సుశాంత్‌కు బైపోలార్ డిజార్డర్ ఉందని, అతన్ని కుటుంబీకులు దూరం పెట్టారని, ఆ డిప్రెషన్‌లోనే, మానసిక అనిశ్చితికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని, తనకేమీ సంబంధం లేదని ఆమె తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
అంతేకాకుండా, తనపై నార్కోటిక్స్ అధికారులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎన్నడూ డ్రగ్స్ వాడలేదని కోర్టుకు తెలుపుతూ, తనకు బెయిల్‌ను మంజూరు చేయాలని ప్రాధేయపడింది. 
 
ఆమె వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బెయిల్‌ను మంజూరు చేశారు. ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న రియా సోదరుడు షోవిక్‌కు మాత్రం బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించడం గమనార్హం. దీంతో షోవిక్ చక్రవర్తి మరికొన్ని రోజుల పాటు జైలుజీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.