శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 మే 2023 (17:00 IST)

బ్రో చిత్రం నుంచి మార్కండేయులుగా సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్

Sai Dharam Tej
Sai Dharam Tej
మేనమామ-మేనల్లుడు ద్వయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి సాయి ధరమ్ తేజ్ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.
 
'బ్రో' చిత్రంలో మార్క్ అలియాస్ మార్కండేయులు అనే పాత్రలో కనువిందు చేయనున్నారు సాయి ధరమ్ తేజ్. ఈరోజు(మే 23) సాయంత్రం 4:14 గంటలకు మార్క్ పాత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. తెల్ల దుస్తులు ధరించి ఫస్ట్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు సాయి తేజ్. మోషన్ పోస్టర్ లో గడియారాన్ని చూపిస్తూ మార్కండేయులుగా సాయి తేజ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ లో "బ్రోదిన జన్మలేషం.. బ్రోవగ ధర్మశేషం.. బ్రోచిన కర్మహాసం.. బ్రోదర చిద్విలాసం" అనే శ్లోకం వినిపిస్తుండగా శాంతికి చిహ్నంలా తెల్ల దుస్తుల్లో సాయి తేజ పాత్రను పరిచయం చేయడం మెప్పిస్తోంది. 
 
మే 18న 'బ్రో' టైటిల్ ని ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన లభించింది.  "కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం.. కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం.. బ్రో బ్రోదిన జన్మలేషం.. బ్రో బ్రోవగ ధర్మశేషం.. బ్రో బ్రోచిన కర్మహాసం.. బ్రో బ్రోదర చిద్విలాసం" అనే శ్లోకంతో పవన్ కళ్యాణ్ పాత్రను పరిచయం చేసిన తీరు కట్టిపడేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ మోషన్ పోస్టర్ అత్యధిక వీక్షణలతో సోషల్ మీడియాలో సంచలన రికార్డులు సృష్టించింది. 
 
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థగా దూసుకుపోతోంది. 'కార్తికేయ-2', 'ధమాకా' వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఈ సంస్థ.. ప్రస్తుతం పలు చిత్రాలను నిర్మిస్తోంది. అందులో 'బ్రో' వంటి భారీ చిత్రాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో మొదటిసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చేతులు కలపడం, పైగా ఇందులో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తుండటంతో ప్రకటనతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్మాణ సంస్థ ఎక్కడా వెనకాడకుండా భారీస్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమా చాలాకాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవడమే కాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్థాయిని మరింత పెంచే చిత్రమవుతుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
 
'బ్రో' సినిమా 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే అద్భుతమైన చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
 
తారాగణం: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ , సముద్ర ఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా,తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృథ్విరాజ్, నర్రాశ్రీను, యువలక్ష్మి , దేవిక, అలీ రెజా, సూర్య