శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (15:00 IST)

'సైరా' క్లైమాక్స్ అదిరిపోతుంది : డైరెక్టర్ సురేందర్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి. దాదాపు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రాం చరణ్ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో నయనతార, తమన్నా, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి అగ్రనటీనటులు నటించారు. 
 
ఐదు భాషల్లో నిర్మితమైన ఈ సినిమా అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంపై దర్శకుడు సురేందర్ రెడ్డి స్పందించారు. "ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథ వినగానే దేశభక్తితో నా రోమాలు నిక్క బొడుచుకున్నాయి. ఆయన గురించిన సమాచారం కోసం ఎంతో పరిశోధన చేశాను.
 
చివరి సమయంలో ఆయన వెనుక పదివేల సైన్యం ఉందని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆయన బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎంతగా భయపెట్టి వుంటారో.. ఆయనని ఆంగ్లేయులు ఎంతగా బాధపెట్టి వుంటారో అనిపించింది. ఈ కోణంలోనే నేను క్లైమాక్స్‌ను డిజైన్ చేసుకున్నాను. ఈ క్లైమాక్స్‌ను అనేక మార్లు తెరపై చూసుకున్నాను. చూసిన ప్రతిసారి నా హృదయం ఉప్పొంగింది. ఈ క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని ఉద్వేగానికి గురిచేస్తుంది" అని చెప్పుకొచ్చాడు. 
 
ఇప్పటికే అన్ని రకాల పనులు పూర్తి చేసుకుని విడుదలకు సర్వం సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రీమియర్ షో అక్టోబరు ఒకటో తేదీనే అమెరికాలో ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ప్రీబుకింగ్స్ రూపంలో ఇప్పటికే 337,875 డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. 
 
ఈ క్రమంలో సైరా నరసింహా రెడ్డి అమెరికాలో సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. అమెరికాలోని అన్ని థియేటర్లలో (దాదాపు 199  ప్రాంతాల్లో) ఈ చిత్రం విడుదలకానుంది. ముఖ్యంగా, ప్రధాన నగరాలతో పాటు.. ప్రవాస భారతీయులు అధికంగా నివసించే ప్రాంతాలన్ని అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో ఈ చిత్రం ప్రదర్శితంకానుంది. గతంలో ఒక్క చిరంజీవి చిత్రమే కాదు.. ఏ ఒక్క హీరో చిత్రం కూడా ఇంత భారీ స్థాయిలో విడుదలైన దాఖలాలు లేవు. 
 
ఇకపోతే, సైరా చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా నేపథ్య సంగీతం గురించి స్పందిస్తూ, సైరా ప్రాజెక్టుకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ (నేపథ్య సంగీతం) కీలకమైనవి. సైరాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అదే సైరా ఆత్మ. దీంతో సైరా మరో స్థాయికి వెళ్త్తుంది. తపస్ నాయక్ సారథ్యంలో ఐదు భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన డీటీఎస్ మిక్సింగ్ పూర్తి చేశారని చెప్పారు. 
 
కాగా, భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోంది.